7
1 అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “చూడు, నేను నిన్ను ఫరోకు దేవునిలా చేస్తాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు.
2 నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ నీవు చెప్పాలి, ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వాలని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పాలి.
3 కాని నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, కాబట్టి ఈజిప్టు దేశంలో నా సూచనలను, అద్భుతాలను అధికంగా చేసినప్పటికీ,
4 ఫరో మీ మాట వినడు. అప్పుడు నేను ఈజిప్టుపై నా చేతిని ఉంచి గొప్ప తీర్పు చర్యలతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం బయటకు తీసుకువస్తాను.
5 నేను ఈజిప్టుకు వ్యతిరేకంగా చేయి చాచి ఇశ్రాయేలీయులను దాని నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు నేను యెహోవానని ఈజిప్టువారు తెలుసుకుంటారు.”
6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
7 వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు అహరోనుకు 83 సంవత్సరాలు.
అహరోను కర్ర పాముగా మారడం
8 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,
9 “ ‘ఒక అద్భుతకార్యం చేయండి’ అని ఫరో మీతో చెప్పినప్పుడు, నీవు అహరోనుతో, ‘నీ చేతికర్రను తీసుకుని ఫరో ఎదుట పడవేయి’ అని చెప్పు. అది పాముగా మారుతుంది.”
10 మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగానే అది పాముగా మారింది.
11 ఫరో జ్ఞానులను మంత్రగాళ్ళను పిలిపించాడు. ఈజిప్టువారి మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో అలాగే చేశారు.
12 ప్రతి ఒక్కరు తమ కర్రను క్రింద పడవేయగా అది పాముగా మారింది. అయితే అహరోను కర్ర వారి కర్రలను మ్రింగివేసింది.
13 కాని యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటను వినలేదు.
మొదటి తెగులు: నీరు రక్తంగా మారుట
14 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఫరో హృదయం కఠినమైనది కాబట్టి అతడు ప్రజలను పంపించడానికి నిరాకరిస్తాడు.
15 ఫరో నదికి వెళ్లేటప్పుడు ఉదయాన్నే నీవు అతని దగ్గరకు వెళ్లు. నైలు నది తీరాన నీవు అతనికి ఎదురు వెళ్లు. పాముగా మారిన కర్రను నీ చేతితో పట్టుకో.
16 అతనితో, ‘అరణ్యంలో నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వమని నీతో చెప్పడానికి హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపాడు. ఇప్పటివరకు నీవు మాట వినలేదు.
17 యెహోవా చెప్పిన మాట ఇదే: దీని ద్వారా నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. నా చేతిలో ఉన్న కర్రతో నేను నైలు నది నీటిని కొడతాను. అది రక్తంగా మారుతుంది.
18 నైలు నదిలోని చేపలన్నీ చస్తాయి, నది కంపు కొడుతుంది; ఈజిప్టువారు దాని నీటిని త్రాగలేరు.’ ”
19 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నారు, “నీవు అహరోనుతో ఇలా చెప్పు, ‘నీ కర్రను తీసుకుని ఈజిప్టు జలాల మీద అనగా వారి నదులు కాలువలు చెరువులు, అన్ని జలాశయాల మీద చాపు, అప్పుడు అవన్నీ రక్తంగా మారుతాయి.’ ఈజిప్టులో ఎటు చూసినా రక్తమే ఉంటుంది. చివరికి చెక్క, రాతి పాత్రల్లో కూడా.”
20 మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకి లేపి నైలు నది నీటిని కొట్టగా, దాని నీరంతా రక్తంగా మారాయి.
21 నైలు నదిలోని చేపలు చనిపోయి, నది కంపు కొట్టడంతో ఈజిప్టువారు ఆ నీటిని త్రాగలేకపోయారు. ఈజిప్టులో ఎటు చూసినా రక్తమే కనబడింది.
22 అయితే ఈజిప్టు మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో వాటిని చేశారు, అయితే యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటలను వినిపించుకోలేదు.
23 దానికి బదులు, ఫరో తన రాజభవనానికి తిరిగి వెళ్లిపోయాడు, కనీసం జరిగిన వాటి గురించి ఆలోచించలేదు.
24 ఈజిప్టు వారంతా నైలు నది నీటిని త్రాగలేక త్రాగునీటి కోసం నది ప్రక్కన త్రవ్వారు.
రెండవ తెగులు: కప్పలు
25 యెహోవా నైలు నదిని కొట్టి ఏడు రోజులు గడిచాయి.